కుక్క- గాడిద మూడవ భాగం

 

                 కుక్క - గాడిద - 3



"వెనకటికి నేనెరిగిన నక్క ఒకటి ఉండేది. ఓ రోజూ దానికి ఎంత తిరిగినా తిండి దొరకలేదు. నకనకలాడే ఆకలితో ఎంతో దూరం నడుచుకుంటూ పోయింది. దానికి ఒక యుద్ధభూమి కనిపించింది.అక్కడ పడున్న సైనికుల శవాలు, చచ్చిపడున్న గుర్రాలు,ఏనుగులు చూసింది.నోరూరిపోయి ముందుకు అడుగు వేయబోతుంటే,పెద్ద మోత వినిపించింది.ఆ శబ్దానికి నక్క భయపడి మూర్ఛపోయింది.కొంత సేపయిం తర్వాత మూర్ఛనుంచీ లేచి చూస్తే,అక్కడ ఏ శత్రువులూ కనపడలేదు. కొంచెం దూరంలో ఓ చెట్టుకింద సైనికులు పడేసిన నగారా (డప్పు) కనిపిచింది. గాలికి చెట్టుకొమ్మలు,ఊడలు ఊగి నగారాకు తగిలినప్పుడు నగారా పెద్ద మోత చేస్తున్నది.అంతే! ఈ మాత్రానికే భయపడి,ఎదురుగా ఉన్న ఆహారం వదిలి పారిపోబోయమేమిటి? అని సిగ్గుపడిపోయి నక్క నిశ్చింతగా తనకు కడుపు పట్టినంత మాంసం మెక్కి వెళ్ళిపోయింది! అందువల్ల,కేవలం శబ్దం విని కంగరుపడటం అనవసరం అని నా సలహ.
"మీరు నాకు ఆజ్ఞ ఇస్తే, నేను ఇప్పుడే ఆ రంకె మోత ఎక్కడినించీ,ఎలా వచ్చిందో కనుక్కొని  వస్తాను" అన్నాడు దమనకుడు.
పింగళకుడి ప్రాణం లేచొచ్చింది.అతనికి కావలసింది అదే.ముందు ఎవరైనా వెళ్ళి,ఆ రంకె పెట్టిన శత్రువేవరో, దాని బలాబలాలేమిటో చూసొస్తే, అప్పుడు ఆ శత్రువుని ఎదుర్కొనేందకు ఏదైనా ఉపాయం ఆలోచించవచ్చు.
"సరే,ముందా ఆ పని చేసిరా. శత్రువు బలమేమిటో తెలిసిన తర్వాత, అతన్ని గెలిచే ఉపాయం నేను చూస్తాను.అతన్ని కలిసి చెప్పవలసిన నాలుగు మాటలూ,సమయోచితంగా చెప్పిరా.నువ్వు తెలివైనవాడివి,ఎలా మాట్లాడాలో,ఏం మాట్లాడాలో నీకు చక్కగా తెలుసు.వెళ్ళిరా!" అన్నాడు.
దమనకుడు ఎంతైనా జిత్తులమారి నక్క. ఎలాగైనా రాజును మంచి చేసుకొని,అతనికి దగ్గరివాడు, సలహాదారుడు, సన్నిహితుడు అనిపించుకొంటే అడవిలో మిగతా జంతువులూ తనని గౌరవిస్తాయని అతనికి తెలుసు.
అతను వెంటనే బయల్దేరి, అడుగుజాడల బట్టి వెతుకుతూ సంజీవకుడనే ఆ ఎద్దు తిరుగుతున్న ప్రాంతానికి చేరాడు.
"సంజీవకా!నేను ఈ రాజయిన పింగళ కుడికి చాలా దగ్గరవాణ్ణి. ఆయన పంపితేనే నీ దగ్గరకి వచ్చాను. ఈ అడవి అంతా ఆయన రజ్యమేమని నీకు తెలియదనుకొంటాను.ఇందాక నువ్వు వేసిన రంకె విని ఆయనకి చాలా కోపం వచ్చింది.ఆయనకు నేనేదో రకంగా నచ్చాజెప్పాను. ఇప్పటికయినా నువ్వు మర్యాదగా ఆయన దగ్గరకి వెళ్లి తప్పు ఒప్పుకుని నమస్కారం చేసుకొంటే,ఆయన తన కొలువులో నీకు తగ్గ పనేదైన అప్పజెప్పి,తన పరివారంలో ఉంచుకుంటాడు. లేదంటే, నిన్ను శత్రువుగా భావించి నీ మీదకి ఉరికి చీల్చి చెండాడతాడు" అన్నాడు.
ఈ మాట విని సంజీవకుడు భయంతో గజగజ వణికిపోయాడు.సింహమంటే ఏ జంతువుకయినా భయమే కదా?
అతని భయాన్ని గమనించిన దమనకుడు మరో ఎత్తు వేశాడు.
"సంజీవకా, భయపడకు,నేను నిన్ను రక్షిస్తాను.మా రాజు దయగలవాడు. ధార్మికుడు.అతనికి చెప్పాల్సిన విధంగా నేను చెప్తాను.నువ్వు నాతో పాటు వచ్చేయ్"అన్నాడు.
దమనకుడూ,సంజీవకుడూ రాజు దగ్గరకి బయల్దేరారు. దమనకుడు ముందుగా రాజు దగ్గరకు వెళ్లి,"రాజా, మీ ఆజ్ఞ ప్రకారం వెళ్ళి చూసి వచ్చాను.ఆ రంకె వేసినవాడు సంజీవకుడు.వాడు మీకు శత్రువు కాదు.మీకు కోపం వచ్చిందని చెప్పగానే భయంతో వణికిపోతున్నడు.నేను చెప్పాను భయపడోద్దని. పెనుగాలి పెద్ద పెద్ద చెట్లను కూలుస్తుంది గానీ గడ్డిపరకలనేమీ చేయదు.వాటిని లక్యపెట్టదు.అలాగే మా రాజు నీలాంటి బలహీనులనేమి చేయాడు. ఆయన పరాక్రమం ఆయనకు దిటయిన శత్రువుల మీద చూపుతాడు తప్పా నిన్ను నన్ను ఎంతో దయగా చూస్తాడు అని చెప్పి నేను సంజీవకున్ని ఇక్కడికి తీసుకువచ్చాను. మీరు సరెనంటే మీ ముందుకు తెస్తాను"అన్నాడు.రాజు సరెనన్నాడు.
దమనకుడు తిరిగి సంజీవకుడి దగ్గరకి వెళ్లి"మిత్రమా! నీ అదృష్టం బాగుంది.రజుగారొక్కడే కూర్చొని ఉన్నాడు. పద, వెళ్ళి కలుద్దాం" అన్నాడు.
భయం భయంగా వంగి దణ్ణాలు పెడుతూ సంజీవకుడు, పింగళకుడి ఎదురుగా నిల్చున్నాడు.
పింగళకుడు గంభీరంగా చూస్తూ,"ఏమోయ్ సంజీవకా,మా దమనకుడు నీ గురించి, నీ తెలివితేటలా గురించి నాకు పూర్తిగా చెప్పాడు.చాలా సంతోషం. నీలాంటి బుద్దిమంతుడు నా దగ్గర మంత్రిగా ఉంటే మనకిద్దరికీ లాభమే. అంచేత,ఈరోజు నుంచీ నువ్వు నాకు మంత్రిగా ఉండి, ఈ అడవినీ అందులో జంతువుల్ని పరిపాలించడంలో నాకు సహాయకుడిగా ఉండు!"అన్నాడు.
ఆరోజు నుండీ పింగళకుడికి,సంజీవకుదు విశ్వాసపాత్రుడయి చాలా సన్నిహితుడయ్యాడు.వాళ్లిద్దరి స్నేహం రోజురోజుకీ బలపడిపోయి, పింగళకుడు దమనకుడిలాంటి ఇతర సేవకుల్ని పట్టించుకోవడమే తగ్గిపోయింది.
దాంతో నిరుత్సాహపడిపోయి, దమనకుడు మళ్ళీ కరటకుడి దగ్గరకి వచ్చేశాడు.
కరాటకుడు "చూశావా తమ్ముడూ, మనకెందుకు ఈ రాజు కొలువు అని చెప్తే వినలేదు.పైగా ఎదురు బోలెడు నీతులు నాకే చెప్పుకొచ్చావు. ఇప్పుడు నీకే అక్కడ చోటు లేకుండా పోయింది!"అన్నాడు.
"నిజమే,నేను చేసింది పొరపాటే.అయిన నువ్వు నన్నేం దెప్పిపొడవక్కర్లేదు. దేవుడు దయ తలచకపోతే ఏ ప్రయత్నమూ ఫలించదు.ఆశాఢభూతి కథలో ఏమైందో తెలుసుకదా? మర్చిపోతే చెప్తాను విను" అంటూ దమనకుడు ఆ కథ మొదలెట్టాడు.

కుక్క-గాడిద రెండవ భాగం

 

             కుక్క-గాడిద - 2



కరటకుడు " రాజు దగ్గర కొలువు చేయాలంటే జాగ్రత్తగా రాజు మనసు తెలుసుకొని ప్రవర్తించాలి.నీ ఇష్టప్రకారం పనిచేయలేవు. జాగ్రత్త!" అని అతణ్ణి హెచ్చరించాడు.
"ఉద్యోగికి దూరభూమీ, విద్వాంసుడికి పరదేశం,మంచిగా మాట్లాడేవారికి శత్రువు ఉండరు. అలాగే బుద్ధిమంతుడుకి అసాధ్యమనేది ఉండదు. మంచి ప్రవర్తనతో ఎప్పుడూ తన సేవ చేసే వాళ్ళను రాజు ఎప్పుడూ ఆదరిస్తాడు.ఆయన కోపంగా ఉన్నడా,శాంతంగా ఉన్నాడా గమనించుకొంటూ నడుచుకుంటే,రాజు అభిమానం తేలిగ్గా పొందవచ్చు"అన్నాడు దమనకుడు.
"ఇంతకు రాజు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడాలి?"
"ఒక్క మటంటూ లేదు. ఆయన మొహం వైపే చూస్తూ,ఆయన నావైపు చూసినప్పుడు ఏదో సమయానికి తగ్గట్టు మాట్లాడేస్తాను. కాస్త ముందు వెనక ఆలోచించుకొని,ఆ కొలువులో ఉన్న మిగిలిన వాళ్లేవరికి కోపాలు రాకుండా,మాట్లాడతాను".
"సరే నీ ఇష్టం. అదుగో రాజు తన ఇంటికి పోతున్నట్టున్నాడు.ఇప్పుడే పట్టుకో పో!"అన్నాడు కరటకుడు.
దమనకుడు పింగళకుడు వైపు పరుగెత్తాడు.అతని దగ్గరకి వెళ్ళి, వినయవిదేయతలు చూపిస్తూ ఒదిగి నిలబడి నమస్కారం చేసాడు. పింగళకుడు అతన్ని కూర్చోబెట్టి 'ఏమయ్యా, బాగున్నావా?" అన్నాడు.
"రాజా, నీ రాజ్యంలో నేనే కాదు, ఇతర జంతువులన్నీ కూడా ఎప్పుడూ సుఖంగా, క్షేమంగానే ఉంటాయి. మీరు పిలవకపోయినా అప్పుడప్పుడూ వచ్చి మీతో మంచి చెడ్డ చెప్పుకొని వెళ్ళటం నా ధర్మం. అలా రాకపోవటం స్వామి ద్రోహం అవుతుంది. మీలాంటి మహానుభావుడి నేను చెప్పగలిగింది ఏమున్నది,కానీ ఒకమట చెప్తాను.మనిషికి బుద్ధి వికసించాలంటే నాలుగు పనులు చేయాలి.ఒకటి బహుడేశటనం,అంటే ఇల్లు విడిచి నాలుగు ఊళ్లు తిరిగి రావడం.రెండు బహూశృతులతో సాంగత్యం,అంటే మంచి పండితులతో స్నేహం.మూడు కావ్యాశాస్త్ర పఠనం,అంటే మంచి పుస్తకాలు, శాస్త్రాలు చదవటం.నాలుగు రాజస్థానంలో బహుకాల సేవ అంటే మీలాంటి పెద్దల దగ్గర పది కాలాలపాటు ఉద్యోగం చేసుకోవటం.ఈ నాలుగు లేకపోతే మనిషికి లోకజ్ఞానం కలగదు.బావిలో కప్ప లాగా పడుంటాడు.తన నెత్తి పైన కనిపిస్తున్న కొంచెమే సర్వస్వమనీ అనుకొంటూ మూర్ఖుడిగా ఉండిపోతాడు. మీలాంటి వాళ్ళని అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటే, నాలాంటి అల్పుడికి కూడా కొంచెం తెలివితేటలు వస్తాయి"అంటూ తియ్యటి కబుర్లు చెప్పాడు.
తర్వాత" రాజా,ఇందాక మీరు యమునానది ఒడ్డుకు వెళ్ళి కొంచెం సేపు అక్కడ నిలబడిపోయి వెనక్కు వచ్చేయటం చూశాను.కారణమేమిటో నాకు తెలియలేదు?" అన్నాడు.
రాజు దమనకుడి పొగడ్తలకు, తీపి మాటలకూ మెత్తబడిపోయి ఉన్నాడు."ఓ అదా? నీలాంటి మంచి మిత్రుడికి చెప్పకూడని రహస్యమేమీ కాదు.అక్కడ ఏదో రంకె వినిపించిందయ్యా.ఆ కేక పెట్టిన జంటువేదో కానీ చాలా బలం గల జంతువు అయి ఉండాలి. లేకపోతే నా రాజ్యంలో నాకు వినపడేలా అంత పెద్ద రంకె వేసేందుకు ధైర్యం ఎవరికి ఉంటుంది?నా అడవిలోనే ఎవరో కొత్త శత్రువు చేరాడన్నమాట.ఎవరన్నది తెలియలేదు.శత్రువుని పట్టి చంపలేకపోతే న రాజ్యంలో నాకేం గౌరవం ఉంటుంది చెప్పు.లోకంలో నలుగురూ నన్ను చూసి నవ్విపోతారు. ఈ శత్రువు ఎవరూ,అతన్ని ఎలా చంపాలీ అన్న ఆలోచనలో పడిపోయానోయ్.ఏం చేస్తే బావుంటుందంటావు?"అని దమనకుడిని సలహా అడగనే అడిగాడు.
దమనకుడు కొంచెం సేపు ఆలోచన నటించాడు."రాజా!నన్నడిగితే, ఊరికే ఒక రంకె విని భయపడటం అనవసరం".




కుక్క-గాడిద మొదటి భాగం

        

                  కుక్క-గాడిద -1



కాశీనగరంలో ధావకమల్లుడు అనే రజకుడు ఉండేవాడు. ఒకరోజు అతను చాలా బట్టలు ఉతికేసి, అలసిపోయి,ఆ బడలికతో ఆ రాత్రి ఒళ్ళు మరచి నిద్రపోయాడు. ఆనాడు అర్థరాత్రి సమయంలో అతని ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు.
ఇంటి బయట ధావకమల్లుడు తన గాడిదని కట్టేసి ఉంచాడు. దాని పక్కనే ధావకమల్లుడు పెంచుకుంటున్న కుక్క కూడా కూర్చొని ఉంది. దొంగ ఇంట్లోకి చొరపడటం కుక్క,గాడిద రెండూ చూస్తూనే ఉన్నాయి.
గాడిద కుక్కని అడిగింది:  " ఇంట్లోకి దొంగ చొరబడితే చూస్తూ ఉరుకున్నవ్, మొరిగి యజమానిని  నిద్ర లేపవేమిటి?" అని.
" నేనేం చేయాలో చెప్పేందుకు నువ్వేవరివి?" అంది కుక్క మొండిగా.
"యజమాని ఇల్లు దొంగ దోచుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావా?"
" అబ్బో! మహా యజమాని! ఇరవై నాలుగు గంటలు ఈ ఇల్లు ఎంత కనిపెట్టుకు ఉన్న, యజమాని మాత్రం మన సంగతి పట్టించుకోడు. సరిగ్గా ఇంత తిండి కూడా పడెయ్యడు. ఇలాంటి యజమానికేమిటి సేవ చేసేది? నేను చెయ్యను" అంది కుక్క.
గాడిదకు కోపం వచ్చింది "యజమానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు,అక్కరకు రాకపోవటం ధర్మం కాదు. అది కృతఘ్నత.మహాపాపం. అయిన నువ్విప్పుడు మొరగనని మొందికేస్తే ఏదో మునిగిపోతుందనుకోకు. నీ పని నేను చేసి యజమానిని నిద్రలేపుతాను చూడు!" అని తనే పెద్దగా ఓండ్ర పెట్టింది.
వచ్చిన దొంగ ఆ శబ్దానికి భయపడి పారిపోయాడు. కానీ మంచి నిద్రలో ఉన్న యజమాని నిద్రలో నుండి లేచి, వేళ కాని వేళలో కూతపెట్టి తన నిద్రచెడగొట్టిన గాడిద మీద పిచ్చికోపం వచ్చి, ఓ దుడ్డుకర్రతో గాడిద తలమీద మోదాడు.తలకి గట్టి దెబ్బ తగిలి, అప్పటికప్పడే గాడిదకు ప్రాణం పోయింది.
అందుచేత,ఎవరి పని వారు చేసుకోవాలి గానీ పరాధికారం నెత్తిన వేసుకోవటానికి ప్రయత్నించగూడదు. సింహాన్ని దాని మానాన వదిలేసి,అడవిలో మనకు పనికొచ్చే ఆహారం ఏదన్నా వేతుకొందం పద"అంటూ కరటకుడు కథ ముగించాడు.
దమనకుడు మాత్రం ఓప్పుకోలేదు. తనకు తోచిన నీతులు తను చెప్పటం మొదలెట్టాడు "తిండి ఎప్పుడూ తినేదే,దానికి తొందర లేదు.తిండి, భయం, నిద్రా అన్ని ప్రాణులకూ ఎప్పుడూ ఉండేవే. ఊరికే తిని ,పడివుండటంలో గొప్పేంముంది? అది అందరూ చేస్తారు.మనం బతుకుతూ,మనతోపాటు నలుగుర్ని బతికించగలిగితేనే జీవితానికి ఒక అర్థం.కుక్క చిన్న ఎముక ముక్క దొరికితేనె సంతోషపడుతుంది.సింహం అయితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి చంపి ఆ మాంసం తింటేనే గానీ తృప్తి చెందలేదు.ఊరకుక్క ఎంత వేలదపడ్డా,ఎవరూ దానికింత తిండి పడెయ్యరు.అదే ఏనుగు గంబీరంగా,హుందాగా తింటుంటే దానికి ప్రేమగా తిండిపెడతారు. సంఘంలో గౌరవం సంపదించుకొలేకపోతే,ఆ బతుకు హీనం. చదువు వల్లో,బలం చేతో, యుక్తి చేతో రాజును మెప్పించి గౌరవం తెచ్చుకొనే జీవితమే జీవితం.
"మన కర్మ బాగుంటే తెలివితేటలు కలుగుతాయి.వాటి వల్ల రాజసన్మానం కలుగుతుంది. దానితో తెలివి మరింత రాణించి, అన్ని వ్యవహరాలూ జరపగల సమర్థత వస్తుంది.
దాంతో రాజస్థానంలో మంచి పదవి దొరుకుతుంది.ఎంత రత్నమైన పెట్టెలో ఉంచేసి దాచేస్తే,దాని కాంతి,విలువ నలుగురికీ తెలిసేదెలా? అందుకే రాజుగారిని ఆశ్రయించి,మన తెలివితేటలు ప్రదర్శించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి"
ఇదంతా విన్న తరువాత కరతకుడు కొంచెం మెత్తబడ్డాడు."రాజుగారి కొలువులో చోటు దొరికితే మంచిదే.కానీ,ఈ మృగరాజు పింగళకుడు మనల్ని ఇంతకు ముందు అవమానించి,గెంటి వేశాడన్న బాధతో అలా అన్నాను. బుద్ధి లేని రాజులని ఆశ్రయించితే కష్టాలు తప్పవు గదా అని నా భయం. ఏదైతేనేం,నువ్వు తెలివైనవాడివి కాబట్టి నువ్వే చెప్పు ఇప్పుడు మనమేం చేయాలో, అలాగే చేద్దాం" అన్నాడు.
"పింగళకుడు భయపడిపోయి ఉన్నాడు. అది నీకెలా  తెలిసింది అని అడగకు.ముఖమూ,ఆకారమూ చూసి తెలివైనవాడు ఇతరుల మనస్సులో భావాన్ని పసిగట్టాలి.
అదే గదా పండితుడి లక్షణం?అది లేకపోతే పండితుడికీ,పామరుడికీ, పశువుకీ తేడా లేదు.అదలా ఉంచు. ఇప్పుడు తక్షణ కర్తవ్యమ్ రాజు దగ్గరకు వెళ్ళటం.నేను ఇప్పుడే ఆయన దగ్గరకు పోతున్న నాలుగు మంచి మాటలు చెప్పి ఆయన్ని మంచి చేసుకుంటా ఆయన అభిమానం సంపాదిస్తాను" అన్నాడు దమనకుడు.

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...