నల్లి - పేను

                 నల్లి - పేను 

మందవిసర్పిని అని ఒక చీరపోతు (పేను) ఉండేది. అది చాలారోజులు ఓ రాజుగారి మంచాన్ని పట్టుకొని బతుకుతూ ఉండేది. ఓరోజు దాని దగ్గరికి డిండిమం అనే ఒక నల్లి వచ్చింది. పేను నల్లిని ఆహ్వానించి స్నేహంగా పలకరించింది. ఏ పనిమీద వచ్చావని అడిగింది..

నల్లి ఒక విచిత్రమయిన కోరిక కోరింది.

"నేను చాలా రోజుల్నించీ రకరకాల మనుషుల రక్తాన్ని తాగుతున్నాను. కానీ ఎప్పుడూ రాజరక్తం తాగే అవకాశం | నాకు రాలేదు. రాజులు బాగా మంచి సన్నబియ్యపు అన్నం, ఆవునెయ్యి, రుచికరమయిన పప్పు, కూరలూ, మంచి మాంసం, మద్యం, పిండివంటలూ యివన్నీ తిని వైభవంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ రక్తం ఎంత బాగుంటుందో ఒక్కసారి రుచి చూడాలని నాకు ఎన్నాళ్ళనించో ఆశగా ఉంది. ఈ మంచంమీద నీతోపాటు నన్నూ ఉండనిచ్చావంటే నా కోరిక తీరుతుంది.

పేనుకి ఈ కోరిక నచ్చకపోయినా, మొహమాట పడిపోయింది. "సరే, కానీ తొందరపడబోకు. రాజు వచ్చి మంచంమీద పడుకొని బాగా గాఢమయిన నిద్రలోకి జారుకొనేదాకా నువ్వు ఓపిక పట్టాలి. ఆయనకు బాగా నిద్రపట్టిన తర్వాత, ఆయన శరీరం మెల్లిగా, కొంచెం కొరికి, రక్తం రుచి చూడు. ఆ పని కాగానే వెంటనే వెళ్ళిపోవాలి, లేకపోతే ప్రమాదం!" అంది. అలాగే అని నల్లి, రాత్రయేదాకా పేనుతో బాగా స్నేహంగా ఉంది.

రాత్రి రాజు మంచం మీదికెక్కిన తర్వాత యింకా ఆయనకి సరిగా నిద్ర పట్టక ముందే, నల్లి తన ఆశ ఆపుకోలేక ఆయన శరీరం కొరికింది. రాజు వెంటనే లేచి సేవకుణ్ణి పిలిచి, "ఈ మంచంలో ఏదో తేలులాగా నన్ను కుట్టింది. అదేమిటో చూడు" అన్నాడు. సేవకుడు దీపం తెచ్చి వెతికే లోపల నల్లి దూరంగా పాకిపోయింది. అతనికి నల్లి కనపడలేదు గానీ, మంచానికి ఒక మూల కరుచుకొని ఉన్న చీరపోతు నలుసులాగా కనిపించింది. "ఇదే రాజును కుట్టి ఉంటుంది” అనుకొని సేవకుడు దాన్ని నలిపి చంపేశాడు.

"ఈ కథలో నీతి ఏమిటంటే నమ్మదగనివాణ్ణి దగ్గరకు చేరనిస్తే మనకు కష్టాలు తప్పవు!" అంటూ కథ పూర్తి చేశాడు కరటకుడు. సంజీవకుడి వంటి వాళ్ళను వెంటనే శిక్షించకపోతే రాజుకి ప్రమాదమని అతని సలహా.

కానీ పింగళకుడు దీనికి పూర్తిగా ఒప్పుకోలేదు. “ఈ విషయంలో మనం సంజీవకుడిని శిక్షిస్తే లోకం మనల్నే తప్పుపడుతుంది తప్పా జరిగిన విషయం తెలుసుకోలేదు. మంత్రుల్ని శిక్షించే రాజును లోకం మెచ్చుకోదు. ప్రజల | అభిప్రాయం రాజు ఎప్పుడూ గౌరవించాలి. లేకపోతే రాజు నాశనమయిపోతాడు. అందుకని ఒక పని చేద్దాం.

“దమనకుడు సంజీవకుడి దగ్గరకిపోయి, అతను చేసిన రాజద్రోహం రాజుకు తెలిసిపోయిందనీ, దాంతో రాజుకు అతనిమీద చెడ్డకోపం వచ్చిందనీ, అయినా తప్పొప్పుకొని, కాళ్ళమీద పడితే రాజు అతన్ని క్షమిస్తాడనీ చెప్పాలి. అతను అలా తప్పొప్పుకుంటే ఈసారికి వదిలేద్దాం. లేదంటే, అతన్ని శిక్షించొచ్చు" అన్నాడు.

పింగళకుడు చెప్పిన ప్రకారం దమనకుడు నేరుగా సంజీవకుడి దగ్గరకి వెళ్ళాడు.

పాపం సంజీవకుడికి జరుగుతున్న మోసమేమీ తెలియదు.

కూర్చోబెట్టి, కుశలప్రశ్నలు వేశాడు. దమనకుడు చాలా దీనంగా ముఖం పెట్టి, విచారం నటిస్తూ కూర్చొన్నాడు.

"ఏమైంది, దమనకా, అలా ఉన్నావ్, ఒంట్లో కులాసాగా లేదా?"

"రాజు కొలువు చేసేవాళ్ళకు కులాసా ఎలా ఉంటుంది.
సంజీవకా!"

సంజీవకుడికి అర్ధం కాలేదు. అటూ,యిటూ, తన వెనక పక్కా కంగారుగా చూశాడు. వెనక పక్కనున్న కాటక, పాటకులు చటుక్కున లేచి దూరంగా వెళ్ళిపోయారు.

“ఇదిగో, వీళ్ళిద్దరినీ నువ్వు దగ్గిరకి రానీయటం వల్లే కష్టాల్లో పడ్డావు" అన్నాడు దమనకుడు. సంజీవకుడికి ఏం కొంప మునిగిందోనని భయం వేసింది. “ఏమయిందేమిటి?” అన్నాడు.

"కాటక, పాటకులు రాజుగారి శత్రువులని తెలిసి వాళ్ళనెందుకు చేరదీశావు? రాజుకు ఈ విషయం ఎవరో ఒకరు చెప్పరా? రాజుకీ విషయం తెలియనే తెలిసింది. నీమీద చాలా కోపంగా ఉన్నాడు. ఎవరయినా సంజీవకుడి పక్షం చేరితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేస్తానని ప్రకటించాడు రాజు. ఈ క్షణమే నిన్ను తన ముందుకు తీసుకురమ్మని నన్ను పంపించాడు. ఇప్పుడు మరేం చేస్తావో నువ్వే ఆలోచించుకో” అన్నాడు. దమనకుడు, చాలా విచారంగా ముఖం పెట్టి.

సంజీవకుడికి ఈ మాట విని గుండె ఆగినంత పనయింది. భయంతో నోటమాట రాలేదు కాసేపు. తరువాత తమాయించుకొని యిలా అన్నాడు.

“నేను ఎప్పుడూ రాజుకు మంచే జరగాలని కోరేవాణ్ణి. రాజుకు, ఆ మాటకొస్తే యితరులకయినా సరే, చెడు జరగాలని ఎప్పుడూ అనుకోను. ఎవరో దుర్మార్గులు మాకిద్దరికీ విరోధం కలిగించాలని కుట్ర పన్నారు. నేను యిన్నాళ్ళూ చేసిన శ్రమంతా వృథా అయిపోయింది. అయినా ఎవరేమాట చెప్పినా నమ్మే రాజుల దగ్గర కొలువు చేయడం మూర్ఖత్వమే కాదు. చాలా ప్రమాదకరం కూడా. ఇది చూస్తుంటే నాకు సింహము-ఒంటె కథ గుర్తుకొస్తున్నది. ఆ కథలో కూడా కాకీ, నక్కా, పులీ కలిసి కుట్ర చేసి ఒంటెను సింహంచేత చంపించినయ్”

“ఆ కథ ఏమిటి?” అన్నాడు దమనకుడు. 

 సంజీవకుడు ఆ కథ చెప్పాడు.

No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...