సింహం - ఒంటె

                సింహం - ఒంటె

మలయపర్వతం సమీపంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో దర్శసారం అనే సింహం రాజుగా ఉండేది. దానికి మంత్రులుగా ఓ కాకి, ఓ పులి, ఓ నక్కా ఉండేవి. అవి ఒకరోజు అడవిలో తిరుగుతుంటే వాటికి ఒక ఒంటె కనబడింది. "నీ పేరేమిటి? నువ్వు ఏ దేశం నించి వచ్చావు?" అని అవి ఒంటెను అడిగాయి.

"నా యజమాని ఒక వర్తకుడు. అతను ఎప్పుడూ నా వీపుమీద మోయలేనంత బరువు సరుకులు ఎక్కించి తిప్పుతుండేవాడు. అలా చాలా సంవత్సరాలు బరువులు మోసీ, మోసీ యింక నావల్ల కాక పారిపోయి వచ్చి ఈ అడవిలో దూరాను. మీరు ముగ్గురూ మంచివాళ్ళులాగా కన్పిస్తున్నారు. మీరు దయదల్చి ఈ అడవిలో నన్ను కూడా ఉండనివ్వండి” అన్నది ఒంటె.

అది విని నక్క యిలా చెప్పింది "నీకు అడవిలో ఉండేందుకు అనుమతివ్వగలిగింది మేము కాదు. ఈ అడవికి దర్శసారమనే సింహం రాజు. మేము ఆ రాజుకు సేవకులం మాత్రమే. నిన్ను ఆయనకు పరిచయం చేస్తాం. మాకు చేతయిన ఉపకారం చేస్తాం. భయపడకు. అంతా బాగానే జరుగుతుంది. మాతో రా".

ఒంటె సంతోషించి, వాటితో కలిసి రాజు దగ్గిరకి వెళ్ళింది. నమస్కారం చేసి నిలబడింది. నక్క ఒంటె కథను రాజుగారికి వినిపించింది. రాజు ఒంటెకు అభయమిచ్చాడు. "నీకేం భయంలేదు. నువ్వు గూడా ఈ ముగ్గురితో పాటు నాకు మంత్రిగా ఉండు" అన్నాడు. ఒంటె సంతోషంగా అంగీకరించింది.

అలా కొంతకాలం గడిచింది. ఒకసారి సింహం తన మంత్రులని పిలిచి యిలా అంది. "నా శరీరం ఆరోగ్యంగా లేదు. రోగం వల్ల నేను చాలా నీరసపడిపోయాను. అడవిలో తిరిగి వేటాడే ఓపిక లేదు. మళ్ళీ ఓపిక వచ్చేదాకా నాకు మీరే ఆహారం తెచ్చిపెట్టాలి".

కాకి "రాజా, మేము చిన్నప్రాణులం. మీ అంత శక్తి మాకు లేదు. మీరు తెచ్చుకున్న ఆహారంలో మీరు తిని మిగిల్చినది కాస్తా తిని బతికేవాళ్ళం, మీకు ఒక్కపూటయినా ఆహారం తెచ్చిపెట్టే శక్తి మాకెక్కడిది?" అంది.

"దొరికినంతే తీసుకురండి. ఈ రోగం లేకపోతే మిమ్మల్ని అడిగే పని ఉండేది కాదు. ఏం చేస్తాం? కర్మ! భయపడకండి. అడవిలోకి వెళ్ళి ఏ మాంసం దొరికితే అదే తీసుకురండి” అంది సింహం. నాలుగు జంతువులూ బయల్దేరి అడవంతా తలా ఒక దిక్కూ గాలించాయి. ఎక్కడా మాంసం దొరకలేదు. మధ్యాహ్నం అయిపోయింది.

కాకి మిగిలిన జంతువులతో యిలా అంది. “పొద్దున్నించీ తిరిగినా మీకు ఏమాత్రం మాంసం దొరకలేదు. మీకే దొరక్కపోతే చిన్నవక్షిని, నాకెలా దొరుకుతుంది? మధ్యాహ్నం అయింది. పాపం రాజు ఆకలితో మనకోసం చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్తాం? ఇన్నాళ్లూ ఆయన వేటాడి సంపాదించి తెస్తే, మనం కడుపునిండా తిని బతికాం. ఇప్పుడు రాజుకి యిబ్బంది వస్తే ఒక్కపూటకు సరిపడా ఆహారం కూడా మనం సంపాదించలేకపోతున్నాం. మనమేం సేవకులం?" అని, అటూ యిటూ చూసి నక్కనీ, పులినీ పక్కకు పిలిచి, వాటి చెవిలో రహస్యంగా యిలా అంది. "ఓ పనిచేద్దాం. ఈ ఒంటెను చంపగలిగితే ఈరోజుకు మన రాజుకు ఆహారం దొరుకుతుంది. ఆయన తిని మిగిల్చిన మాంసం మనం నాలుగురోజులు నిశ్చింతగా తినొచ్చు" అంది.

అది విని నక్క, “అది కుదిరే పనికాదు. మన రాజు ఒంటెకు మంత్రి పదవి యిచ్చి ఎంతో గౌరవిస్తున్నాడు. ఇలా జరిగిందని తెలిస్తే మనని బతకనిస్తాడా?" అంది.

"ఆకలిబాధలో ఉన్నవాడు ఇది చేయచ్చు. ఇది చేయగూడదు అని ఆలోచించలేడు. పాములు సొంత గుడ్లే తినేస్తయ్. పులులు తమ పిల్లల్ని తామే చంపి తింటయ్. కారణం ఆకలి బాధే కదా?" అంది కాకి.

పులి “మనరాజు ఆకలిబాధతో ఒంటెను చంపితే చంపుకోనియ్యండి. ఆ పాపం మనకి వద్దు. మనం రాజు దగ్గరికి వెళ్ళి మనం పడ్డ శ్రమ ఏమిటో చెబుదాం. తర్వాత ఏం చేయాలో ఆయన్ను కూడా అడిగి ఆలోచిద్దాం" అంది.

ఒంటికంటే ముందు మిగిలిన జంతువులు రాజు దగ్గిరకి వెళ్ళాయి. "రాజా! ఎంత శ్రమపడ్డా ఈరోజు మాకు ఏ ఆహారమూ దొరకలేదు. పాపం మీరు మంచి ఆకలి మీద ఉన్నారు. ఓ పని చెయ్యండి, మా ముగ్గురిలో ఒక్కళ్ళని చంపి తినేయండి. మాలాంటి అప్రయోజకులు బ్రతికి ఎలాగూ ఏ లాభమూ లేదు” అన్నాయి. సింహం చెవులు మూసుకొంది.

“హరిహరీ, ఎంత మాటన్నారు! మిమ్మల్ని చంపి నా ఆకలి తీర్చుకుంటే నాకెంత పాపం! అలాటి పనిచేస్తే లోకులు నన్ను అసహ్యించుకోరా? ఇలాటి మాటలు అనకండి" అంది.

నక్క కాకితో యిలా అంది. “నువ్వు చిన్నపిట్టవి. నిన్ను
తినేసినా మనరాజుకు ఆకలి ఎలాగూ తీరదు. అంచేత
నువ్వెళ్ళిపో. రాజుకు నేనే ఆహారం అయిపోతాను”,

అది విని పులి ఊరుకోలేదు. “కాకి కన్నా నువ్వు కొంచెం పెద్ద జంతువువి. అయినా నీ మాంసం కూడా రాజు ఆకలి తీర్చడానికి సరిపోదు. రాజుకు నేను ఆహారం అయిపోతాను" అంది.

"అలా కుదురదు. నీకు బలముంది. ఇవాళ కాకపోతే రేపయినా నువ్వు మన రాజు కోసం ఆహారం వేటాడి తీసుకురాగలవు. నువ్వు చావటానికి వీల్లేదు” అంది నక్క.

ఇలా పోట్లాట జరుగుతుండగా ఒంటె వచ్చింది. "మీరిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటారు? నేను రాజుకు ఆహారమవుతాను. నేను బతికి ఉండటం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు" అంది.

"ఈ ఆలోచన నాకు బాగానే ఉంది. దీనివల్ల రాజుకు పాపం రాదు. ఎందుకంటే సేవకుడు రాజుకోసం ప్రాణాలు వదిలినా, స్వర్గానికే  పోతాడు. ఈ ఆలోచన మీరు ఒప్పుకోకపోతే, మేమందరమూ ప్రాణాలు వదిలేస్తాం” అంది నక్క రాజుతో. “అవును నిజమే, నన్ను చంపి తినండి!” అని ఒంటె కూడా రాజుని ప్రార్థించింది.

చివరకు ఆకలిబాధ తట్టుకోలేక తినేశాడు. రాజు ఒంటెను చంపి తినేశాడు.

“ఈ కథ వల్ల చెప్పొచ్చేదేమిటంటే, ఎంతయినా రాజుకు తన పాత మిత్రుల మీద ఉండే అభిమానం, నాలాంటి కొత్త మిత్రుల మీద ఉండదు" అన్నాడు సంజీవకుడు. "పైగా ఈ రాజుల సేవ ఎప్పటికీ ప్రమాదకరమే. కావాలంటే వడ్రంగీ-సింహము కథ కూడా చెప్తాను విను" అంటూ కథ ఆ కథ మొదలుపెట్టాడు.



నల్లి - పేను

                 నల్లి - పేను 

మందవిసర్పిని అని ఒక చీరపోతు (పేను) ఉండేది. అది చాలారోజులు ఓ రాజుగారి మంచాన్ని పట్టుకొని బతుకుతూ ఉండేది. ఓరోజు దాని దగ్గరికి డిండిమం అనే ఒక నల్లి వచ్చింది. పేను నల్లిని ఆహ్వానించి స్నేహంగా పలకరించింది. ఏ పనిమీద వచ్చావని అడిగింది..

నల్లి ఒక విచిత్రమయిన కోరిక కోరింది.

"నేను చాలా రోజుల్నించీ రకరకాల మనుషుల రక్తాన్ని తాగుతున్నాను. కానీ ఎప్పుడూ రాజరక్తం తాగే అవకాశం | నాకు రాలేదు. రాజులు బాగా మంచి సన్నబియ్యపు అన్నం, ఆవునెయ్యి, రుచికరమయిన పప్పు, కూరలూ, మంచి మాంసం, మద్యం, పిండివంటలూ యివన్నీ తిని వైభవంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ రక్తం ఎంత బాగుంటుందో ఒక్కసారి రుచి చూడాలని నాకు ఎన్నాళ్ళనించో ఆశగా ఉంది. ఈ మంచంమీద నీతోపాటు నన్నూ ఉండనిచ్చావంటే నా కోరిక తీరుతుంది.

పేనుకి ఈ కోరిక నచ్చకపోయినా, మొహమాట పడిపోయింది. "సరే, కానీ తొందరపడబోకు. రాజు వచ్చి మంచంమీద పడుకొని బాగా గాఢమయిన నిద్రలోకి జారుకొనేదాకా నువ్వు ఓపిక పట్టాలి. ఆయనకు బాగా నిద్రపట్టిన తర్వాత, ఆయన శరీరం మెల్లిగా, కొంచెం కొరికి, రక్తం రుచి చూడు. ఆ పని కాగానే వెంటనే వెళ్ళిపోవాలి, లేకపోతే ప్రమాదం!" అంది. అలాగే అని నల్లి, రాత్రయేదాకా పేనుతో బాగా స్నేహంగా ఉంది.

రాత్రి రాజు మంచం మీదికెక్కిన తర్వాత యింకా ఆయనకి సరిగా నిద్ర పట్టక ముందే, నల్లి తన ఆశ ఆపుకోలేక ఆయన శరీరం కొరికింది. రాజు వెంటనే లేచి సేవకుణ్ణి పిలిచి, "ఈ మంచంలో ఏదో తేలులాగా నన్ను కుట్టింది. అదేమిటో చూడు" అన్నాడు. సేవకుడు దీపం తెచ్చి వెతికే లోపల నల్లి దూరంగా పాకిపోయింది. అతనికి నల్లి కనపడలేదు గానీ, మంచానికి ఒక మూల కరుచుకొని ఉన్న చీరపోతు నలుసులాగా కనిపించింది. "ఇదే రాజును కుట్టి ఉంటుంది” అనుకొని సేవకుడు దాన్ని నలిపి చంపేశాడు.

"ఈ కథలో నీతి ఏమిటంటే నమ్మదగనివాణ్ణి దగ్గరకు చేరనిస్తే మనకు కష్టాలు తప్పవు!" అంటూ కథ పూర్తి చేశాడు కరటకుడు. సంజీవకుడి వంటి వాళ్ళను వెంటనే శిక్షించకపోతే రాజుకి ప్రమాదమని అతని సలహా.

కానీ పింగళకుడు దీనికి పూర్తిగా ఒప్పుకోలేదు. “ఈ విషయంలో మనం సంజీవకుడిని శిక్షిస్తే లోకం మనల్నే తప్పుపడుతుంది తప్పా జరిగిన విషయం తెలుసుకోలేదు. మంత్రుల్ని శిక్షించే రాజును లోకం మెచ్చుకోదు. ప్రజల | అభిప్రాయం రాజు ఎప్పుడూ గౌరవించాలి. లేకపోతే రాజు నాశనమయిపోతాడు. అందుకని ఒక పని చేద్దాం.

“దమనకుడు సంజీవకుడి దగ్గరకిపోయి, అతను చేసిన రాజద్రోహం రాజుకు తెలిసిపోయిందనీ, దాంతో రాజుకు అతనిమీద చెడ్డకోపం వచ్చిందనీ, అయినా తప్పొప్పుకొని, కాళ్ళమీద పడితే రాజు అతన్ని క్షమిస్తాడనీ చెప్పాలి. అతను అలా తప్పొప్పుకుంటే ఈసారికి వదిలేద్దాం. లేదంటే, అతన్ని శిక్షించొచ్చు" అన్నాడు.

పింగళకుడు చెప్పిన ప్రకారం దమనకుడు నేరుగా సంజీవకుడి దగ్గరకి వెళ్ళాడు.

పాపం సంజీవకుడికి జరుగుతున్న మోసమేమీ తెలియదు.

కూర్చోబెట్టి, కుశలప్రశ్నలు వేశాడు. దమనకుడు చాలా దీనంగా ముఖం పెట్టి, విచారం నటిస్తూ కూర్చొన్నాడు.

"ఏమైంది, దమనకా, అలా ఉన్నావ్, ఒంట్లో కులాసాగా లేదా?"

"రాజు కొలువు చేసేవాళ్ళకు కులాసా ఎలా ఉంటుంది.
సంజీవకా!"

సంజీవకుడికి అర్ధం కాలేదు. అటూ,యిటూ, తన వెనక పక్కా కంగారుగా చూశాడు. వెనక పక్కనున్న కాటక, పాటకులు చటుక్కున లేచి దూరంగా వెళ్ళిపోయారు.

“ఇదిగో, వీళ్ళిద్దరినీ నువ్వు దగ్గిరకి రానీయటం వల్లే కష్టాల్లో పడ్డావు" అన్నాడు దమనకుడు. సంజీవకుడికి ఏం కొంప మునిగిందోనని భయం వేసింది. “ఏమయిందేమిటి?” అన్నాడు.

"కాటక, పాటకులు రాజుగారి శత్రువులని తెలిసి వాళ్ళనెందుకు చేరదీశావు? రాజుకు ఈ విషయం ఎవరో ఒకరు చెప్పరా? రాజుకీ విషయం తెలియనే తెలిసింది. నీమీద చాలా కోపంగా ఉన్నాడు. ఎవరయినా సంజీవకుడి పక్షం చేరితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేస్తానని ప్రకటించాడు రాజు. ఈ క్షణమే నిన్ను తన ముందుకు తీసుకురమ్మని నన్ను పంపించాడు. ఇప్పుడు మరేం చేస్తావో నువ్వే ఆలోచించుకో” అన్నాడు. దమనకుడు, చాలా విచారంగా ముఖం పెట్టి.

సంజీవకుడికి ఈ మాట విని గుండె ఆగినంత పనయింది. భయంతో నోటమాట రాలేదు కాసేపు. తరువాత తమాయించుకొని యిలా అన్నాడు.

“నేను ఎప్పుడూ రాజుకు మంచే జరగాలని కోరేవాణ్ణి. రాజుకు, ఆ మాటకొస్తే యితరులకయినా సరే, చెడు జరగాలని ఎప్పుడూ అనుకోను. ఎవరో దుర్మార్గులు మాకిద్దరికీ విరోధం కలిగించాలని కుట్ర పన్నారు. నేను యిన్నాళ్ళూ చేసిన శ్రమంతా వృథా అయిపోయింది. అయినా ఎవరేమాట చెప్పినా నమ్మే రాజుల దగ్గర కొలువు చేయడం మూర్ఖత్వమే కాదు. చాలా ప్రమాదకరం కూడా. ఇది చూస్తుంటే నాకు సింహము-ఒంటె కథ గుర్తుకొస్తున్నది. ఆ కథలో కూడా కాకీ, నక్కా, పులీ కలిసి కుట్ర చేసి ఒంటెను సింహంచేత చంపించినయ్”

“ఆ కథ ఏమిటి?” అన్నాడు దమనకుడు. 

 సంజీవకుడు ఆ కథ చెప్పాడు.

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...